తండ్రీ, లోకము
పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ
పరచుము. –యోహాను 17:5
పై వాక్యాలను బట్టి
యేసు అబ్రాహాము పుట్టటానికి ముందే ఉన్నారు, లోకం పుట్టటానికి ముందే దేవుని వద్ద
ఉన్నారు కాబట్టి యేసు దేవుదన్నది నేటి అధిక శాతం బోధకుల వాదన!
లోకం పుట్టక
ముందు నుండే యోబు సైతం ఉన్నాడు! కాబట్టి యోబు దేవుడా?
నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. –యోబు 38:4
నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి. –యోబు 38:21
పై వాక్యాలను బట్టి భూమికి పునాదులు వేయక ముందు నుండే యోబు
ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి యోబు, అబ్రహాము కంటే ముందు నుండి ఉన్నాడు కాబట్టి లేక లోకం
పుట్టటానికి ముందు నుండే ఉన్నాడు కాబట్టి యోబు దేవుడని అనుకోవచ్చా?
లోకం పుట్టక ముందు
నుండే యిర్మీయా సైతం ఉన్నాడు! కాబట్టి యిర్మీయా దేవుడా?
యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను
ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. – యిర్మీయ 1:4-5
పై వాక్యాన్ని బట్టి యిర్మీయ తన తల్లి గర్భంలో పడకముందే
యెహోవా ఆయనను ప్రతిష్ఠించి ఆయనను ప్రవక్తగా కూడా నియమించాడని తెలుస్తుంది. కాబట్టి
యిర్మీయ, అబ్రహాము కంటే ముందు నుండి
ఉన్నాడు కాబట్టి లేక లోకం పుట్టటానికి ముందు నుండే ఉన్నాడు కాబట్టి యిర్మీయను
దేవుడని అనుకోవచ్చా?
లోకం పుట్టక
ముందు యోహాను సైతం ఉన్నాడు! కాబట్టి యోహాను
దేవుడా?
దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. –యోహాను 1:6
పై వాక్యాన్ని బట్టి యోహాను ఈ లోకంలో పుట్టక ముందు నుండే
యెహోవా వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి యోహాను, అబ్రహాము కంటే ముందు నుండి ఉన్నాడు కాబట్టి
లేక లోకం పుట్టటానికి ముందు నుండే యెహోవా వద్ద ఉన్నాడు కాబట్టి యోహానును దేవుడని
అనుకోవచ్చా?
జగత్తు పునాది
వేయకముందే దేవుడు విశ్వాసులను క్రీస్తులో
ఏర్పర్చు కున్నాడు కాబట్టి యేసుతో పాటు విశ్వాసులందరూ దేవుళ్లా?
మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని
జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. – ఎఫెసీ 1:6
లోకం పుట్టక
ముందు సకల విశ్వాసులూ ఉన్నారు! కాబట్టి విశ్వాసులందరూ దేవుళ్లా?
రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను… - 2 ధేస్సలోనీకయులకు 2:13
నేడు బోధకులు బైబిల్
“చదివి” యేసు దేవుడని భావిస్తున్న మాదిరి గానే నాడు యేసు బోధను స్వయంగా “విన్న” ఆదిమ
అపోస్తలులూ అలాగే భావించేవారా?
యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు!
– “సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయని ప్రకటించారు” – “అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని
చెప్పారు!” – “తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు!” –
“నేనే మార్గం, సత్యం, జీవమని
ప్రకటించారు”– ఇంకా “యేసు, దేవుని ప్రియకుమారుడని
ప్రకటించబడ్డారు!” – “అనేక అద్భుతాలు చేశారు!” – “యెహోవాకు ఉన్న పేర్లు యేసు కూడా
కలిగి ఉన్నారు!” – “పునరుత్థా నమయ్యారు!” వగైరా ప్రత్యేకతలు యేసుకు ఉన్నప్పుడు
యేసును దేవుడని భావించటంలో తప్పేమిటి? ఇన్ని ప్రత్యేకతలు
యేసు దేవుడు కాకపోతే ఆయనకు ఉంటాయా? అన్నది నేటి అధిక శాతం
సువార్తీకుల వాదన!
ఈ వాదన వినటానికైతే ఎంతో బాగుంది. అయితే నేడు పై ప్రత్యేకతలను
బట్టి యేసును దేవుడని భావించటంలో తప్పులేదని ఊహించుకునేవారు... తాము చదువుతున్న
ప్రత్యేకతలు ఆదిమ అపోస్తలు లకు సైతం తెలిసే ఉంటాయి కదా అన్నది ఎందుకు ఆలోచించరు? ఆ ప్రత్యేకతలను బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసే దేవుడనే ప్రచారం చెయ్యక
యేసు “మెస్సియ” అనే ప్రచారం మాత్రమే ఎందుకు చేసేవారు? అన్న
కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?
ఆదిమ అపోస్తలులకు, నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులకూ ఉన్న మౌలిక తేడా
ఏమిటంటే- నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న
బోధకులు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న యేసు, దేవుడు కాకపోవటం ఏమిటి? అని ఊహించుకుంటున్నారు.
కానీ, ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా తర్ఫీదు
పొంది, ఆయన వద్ద శిక్షణ పొంది, ఆయన
చెప్పిన సమస్త సువార్తను “చదవటం” కాదు స్వయంగా “విని” ఉన్నారు. దానిని విని నేటి
సువార్తీకుల మాదిరిగా యేసు దేవుడనే అనుమానానికి ఎప్పుడూ గురికాలేదు! అంతేకాదు తాము
స్వయంగా విన్న మరియు చూచిన దానినే మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులే ఈ
క్రింది విధంగా ప్రకటిస్తున్నారు.
ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని టాకీ చూచేనో, అది మీకు
తెలియజేయుచున్నాము. – 1 యోహాను 1:1
దీనిని బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా
విన్నదే బోధించారు తప్ప నేటి సువార్తీకుల మాదిరిగా చదివి లేక ఎవరి ద్వారానో విని
బోధించలేదని తేటతెల్లమవుతుంది. కాబట్టి నేడు బైబిల్ల్ కొన్ని వాక్యాలు కేవలం చదివి
యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే
ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకత లను
బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్టమొదటి
హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని”
“చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించుకోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ,
ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (ఆ.పో.కా 5:42).
చివరకు యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని
ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి
ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు (ఆ.పో.కా 17:3+18:5) తప్పితే నేను దర్శనంలో దేవుణ్ణి
చూచానని గాని, యేసే దేవుడని గానీ ఏనాడూ ప్రకటించలేదు.
కాబట్టి యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు
చేసిన వ్యాఖ్యానమూ ఒక ప్రక్క ఉంది. అదే యేసు సువార్తను “చదివి” నేడు సువార్తీకులు
చేస్తున్న వ్యాఖ్యానమూ మరో ప్రక్క ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏ వ్యాఖ్యానం
ప్రామాణికం అవుతుంది?
అన్నది గమనిస్తే కచ్చితంగా నాడు యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు
చేసిన వ్యాఖ్యానమే ప్రామాణికం అవుతుంది. ఆ తరువాత ఆదిమ అపోస్తలులు చేసిన
వ్యాఖ్యానానికి సరిపోయే వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే దానిని కూడా కచ్చితంగా
తీసుకోవచ్చు.
నిజంగా ఒకవేళ యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు”
అని చెప్పారు! – అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – తండ్రి, నేను ఏకమై యున్నామని
ప్రకటించారు! - అనేక అద్భుతాలు చేశారు! వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని
వ్యాఖ్యానించటం సరైనదే అయితే ఆ పని ఏనాడో ఆదిమ అపోస్తలులు చేసి ఉండేవారు. కాబట్టి
ఏ యే వాక్యాలైతే “చదివి” యేసు దేవుడని నేడు కొందరు ప్రచారం చేస్తున్నారో ఆ
వాక్యాలను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులు, యేసు దేవుడని
ఎక్కడా ప్రచారం చెయ్యలేదంటే నేటి బోధకులు చేస్తున్న ప్రచారం కేవలం వాక్యవిరుద్ధం
అని తెలుస్తుంది. ఇక నాడు యేసుకు, యూదులకు, ఆదిమ అపోస్తలులకూ, యూదులకు,
పౌలుకు, యూదులకూ మధ్య యేసు మెస్సియా?
కాదా? అన్న చర్చే జరిగినట్లు బైబిల్లో చూడగలం తప్ప ఎక్కడా
యేసు దేవుడా? కాదా? అన్న వాదనే
జరిగినట్లు చూడలేము. కానీ అలాంటి ప్రచారాలు చేస్తుంది మటుకు నేటి నామమాత్ర బోధకులు
మాత్రమే! కాబట్టి ఏ వాక్యాలనైతే చదివి నేటి అధికశాతం సువార్తీకులు యేసే దేవుడనే
భావనకు గురై ఉన్నారో ఆ వాక్యాల అసలు వాస్తవికతను పరిశుద్ధ బైబిల్ గ్రంధం వెలుగులో
ఈ వెబ్ సైట్ లో ఎంతో వివరంగా వివరించటం జరిగింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు
పరిశుద్ద బైబిల్ వాక్యాల యదార్ధ వాస్తవీకతను అర్థం చేసుకుని,
అసలు సత్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించు గాక. ఆమేన్.
No comments:
Post a Comment