యోహాను 10:33 లో యేసు తనను తాను దేవుడని ప్రకటించుకున్నారా?

అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము-యోహాను 10:33

పై వాక్యాన్ని బట్టి నేటి సువార్తీకుల వాదన ఏమిటంటే- యేసు యూదుల ముందు “నేను దేవుణ్ణి” అని ప్రకటించుకున్నారు కాబట్టే యూదులు “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అన్నారన్నది.

యేసు నిజంగా తాను దేవుడనని ప్రకటించుకున్నారా? లేక అది యూదుల అభియోగమా?

నేటి సువార్తీకుల అతి చిత్రమైన మరొక వాదన ఏమిటంటే- “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అని యూదులు అన్నప్పుడు యేసు మౌనం వహించారే తప్ప ప్రతిఘటించలేదు! అంటే యేసు తనను తాను దేవుడని ఒప్పుకున్నట్టే కదా! కదా!! అన్నది. ఇంత అమాయకంగా ఆలోచించే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసింది “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అన్న అభియోగాన్ని మోపినప్పుడు యేసు మౌనం వహించలేదు. కానీ, తీవ్రంగా ప్రతిఘటించారన్నది.

యూదులు మోపిన అభియోగానికి యేసు యొక్క తీవ్రమైన ప్రతిఘటన!

అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయు చున్నావని చెప్పుదురా?యోహాను 34-36  

యేసు తనను తాను దేవుడనని చెప్పుకుని దేవదూషణ చేశారన్న నేరానికి యూదులు ఆయనపై రాళ్ళతో కొట్టటానికి సిద్ధపడిన సందర్భంలో యేసు ఇస్తున్న సమాధానమే పై వాక్యం. ఈ వాక్యంలో యేసు యూదులు మోపిన అభియోగాన్ని ఒప్పేసుకుని తాను దేవుడనని చెప్పుకోవటంలేదు! కానీ, యూదులు తనపై మోపుతున్న దైవ దూషణ నేరాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ వాక్యంలో గమనార్హమైన విషయం- “అందుకు యేసు- మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి యుండలేదా?” అన్నది. అంటే- “మనుష్యుడవైయుండి దేవుడవని చెప్పుకొనుచున్నావని” మీరు నా పై దేవదూషణా నేరం మోపు తున్నారు. కానీ స్వయంగా మీరు కూడా దేవుళ్ళని మీరు చదివే ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది కదా! ఒకవేళ నిజంగా నేను దేవుడనని చెప్పుకుని దేవదూషణా నేరానికి పాల్పడి ఉంటే, స్వయంగా మీ ధర్మశాస్త్రం ప్రకారం నాపై మీరు మోపుతున్న దేవదూషణ నేరంలో మీరూ సమాన భాగస్వాములే అవుతారు!” అన్నది.


ఇంతకూ యేసు చెప్పిన ఏ మాటను బట్టి యూదులు యేసుపై దైవ దూషణా నేరం మోపారు?

దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయు చున్నావని చెప్పుదురా?యోహాను 34-36  

యేసు చెప్పిన ఏ మాటను వక్రీకరించి యూదులు, యేసుపై దేవదూషణ నేరం మోపారో తెలుసుకోవాలంటే పై వాక్యం చదివితే తెలుస్తుంది. ఈ వాక్యంలో గమనార్హమైన వాక్య భాగం- “నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి యీ లోకములోనికి పంపిన వానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” అన్నది.  దీనిని బట్టి యేసు, యూదుల ముందు చెప్పుకున్నది “నేను దేవుడను” అన్నది కాదు! కానీ “నేను దేవుని కుమారుడను” అన్నది. ఏదోలా యేసును నేరస్తునిగా నిరూపించటానికి కంకణం కట్టుకున్న నాటి యూదులు యేసు చెప్పే ప్రతీ మాటనూ వక్రీకరిస్తూ ఉండేవారు. అందులో భాగంగానే యేసు నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్న మాటను వక్రీకరించి నీవు మనుష్యుడవైయుండి దేవుడవని చెప్పుకున్నావని దేవదూషణా నేరాన్ని మోపటం జరిగింది.

అయినప్పటికీ “లేదండీ! యేసు, యూదుల ముందు తనను తాను దేవుడని చెప్పుకుని ఉంది ఉండకపోతే యూదులు అలా ఎందుకు అంటారు?” అన్న అనుమానం నుండి బయటపడలేనివారు గమనించాల్సింది... అదే యూదులు, యేసును “దయ్యం పట్టిన వాడని” (యోహాను 8:52), “వెర్రివాడని” (యోహాను 10:19,20), “దుర్మార్గుడని” (యోహాను 18:30), “పాపి” (యోహాను 9:16) అని కూడా ఆయన ముందే అనేక అభియోగాలు మోపారు. అంటే యేసు, యూదుల ముందు తాను పాపినని, వెర్రివాడనని, దయ్యం పట్టిన వాడనని చెప్పుకున్నారు కాబట్టి యూదులు అలాంటి అభియోగాలు మోపారని అర్ధమా? కాదుకదా! అచ్చం అలాగే యేసు తాను దేవుడనని చెప్పుకొనప్పటికీ యూదులు, యేసుపై “నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అని నేరం మోపటం జరిగింది.

ఇలాంటి అభియోగాన్నేయూదులు గతంలోనూ యేసుపై మోపి ఉన్నారు!

“నీవు మనుష్యుడవై యుండి దేవుడవని చెప్పుకొనుచున్నావు” అన్న అభియోగానికి ముందు యూదులు, యేసుపై ఇలాంటిదే మరొక అభియోగాన్ని మోపి ఆయనను చంపటానికి ప్రయత్నించి ఉన్నారు. అదేమిటో ఈ క్రింది గమనించగలరు.

దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యోహాను 5:18  

పై అభియోగానికి సైతం యేసు మౌనం వహించలేదు. వారు ఈ అభియోగం మోపిన వెంటనే ఈ క్రింది విధంగా వారికి సమాధానం చెప్పి వారి అభియోగాన్ని వారి ముఖం పైనే త్రిప్పికొటారు.

కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను- తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కానీ తనంతట తాను ఏదీ చేయనేరడు. –యోహాను 5:19

యేసు చెబుతున్నా పై వాక్యంలో అంతరార్ధం ఏమిటంటే- నిజంగా మీరు చెబుతున్నట్టు నేను దేవునితో సమానమైన వాడినే అయి ఉంటే నేను సైతం దేవుని మాదిరిగా నా అంతట నేనే ప్రతీదీ చేయగలిగి ఉండేవాడిని! కానీ, నేను దేవునితో సమానమైన వాడిని కాను కాబట్టే తండ్రి ఏదైతే నాకు చూపుతాడో అది తప్ప “నా అంతట నేను ఏదీ చెయ్యలేను!” అని అర్ధం. ఈ విధంగా చెప్పి యేసు, యూదుల అభియోగాలను త్రిప్పికొట్టి అనేక చోట్ల యేసు తనను తాను దేవుడు కాదని చెప్పుకున్నారు. ఇలా చెప్పి యేసు ప్రకటిస్తున్నది ఏమిటంటే...

తండ్రి నాకంటె గొప్పవాడు… -యోహాను 14:28

ఇంతకూ యేసు, యూదుల ముందు చెప్పుకున్నది ఏమిటి?

అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా  యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.  అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యోహాను 10:23-25

ఇంతకూ యేసు, యూదుల ముందు చెప్పుకున్నది- ఏమిటో కాస్త పై వాక్యం కళ్లుతెరచి చదివితే అర్ధం అవుతుంది. “నేను క్రీస్తునని మీతో స్పష్టంగా చెప్పితిని గానీ మీరు నమ్మరు” అన్న వాక్య భాగాన్ని బట్టి యేసు తన గురించి తాను చెప్పుకున్నది దేవుడన్నది కాదు కానీ “క్రీస్తు” అన్నది.

అలాగే యేసు, యూదుల ముందు దేవుడని ప్రకటించింది ఎవరిని?

మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. మత్తయి 23:9

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:3

అందుకు యేసుప్రధానమైనది ఏదనగాఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.  – మార్కు 12:29,30

ఈ విధంగా యేసు, యూదుల ముందు దేవునిగా ప్రకటించింది తండ్రి అయిన యెహోవాను! అలాగే అదే యూదుల ముందు తన గురించి తాను ప్రకటించుకున్నది “క్రీస్తు” అని. అయినప్పటికీ యేసు ఏనాడూ తన గురించి తాను దేవుడనని ప్రకటించుకోనప్పటికీ, తన గురించి తాను క్రీస్తునని ప్రకటించుకున్నప్పటికీ, అదే యూదుల ముందు అసలు దేవుడు ఎవరో ప్రకటించి ఉన్నప్పటికీ ఇవేమీ చదవకుండా కేవలం యేసుపై యూదులు మోపిన ఒక అభియోగాన్ని పట్టుకుని యేసు తనను తాను దేవుడని ప్రకటించుకున్నారని ఊహించుకుని  నేటి సువార్తీకులు యేసే దేవుడని ప్రచారం చెయ్యటం ఎంత అసమంజసం మరియు వాక్య విరుద్ధమో అర్ధం కావటం లేదూ!?

నేడు బోధకులు బైబిల్ “చదివి” యేసు దేవుడని భావిస్తున్న మాదిరి గానే నాడు యేసు బోధను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులూ అలాగే భావించేవారా?

యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – “సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయని ప్రకటించారు – “అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు!” – “తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు!” – “నేనే మార్గం, సత్యం, జీవమని ప్రకటించారు”– ఇంకా “యేసు, దేవుని ప్రియకుమారుడని ప్రకటించబడ్డారు!” – “అనేక అద్భుతాలు చేశారు!” – “యెహోవాకు ఉన్న పేర్లు యేసు కూడా కలిగి ఉన్నారు!” – “పునరుత్థా నమయ్యారు!” వగైరా ప్రత్యేకతలు యేసుకు ఉన్నప్పుడు యేసును దేవుడని భావించటంలో తప్పేమిటి? ఇన్ని ప్రత్యేకతలు యేసు దేవుడు కాకపోతే ఆయనకు ఉంటాయా? అన్నది నేటి అధిక శాతం సువార్తీకుల వాదన!

ఈ వాదన వినటానికైతే ఎంతో బాగుంది. అయితే నేడు పై ప్రత్యేకతలను బట్టి యేసును దేవుడని భావించటంలో తప్పులేదని ఊహించుకునేవారు... తాము చదువుతున్న ప్రత్యేకతలు ఆదిమ అపోస్తలులకు సైతం తెలిసే ఉంటాయి కదా అన్నది ఎందుకు ఆలోచించరు? ఆ ప్రత్యేకతలను బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసే దేవుడనే ప్రచారం కచ్చితంగా చెయ్యాలి! కానీ అలా ప్రచారం చెయ్యక యేసు “మెస్సియ” అనే ప్రచారం మాత్రమే ఎందుకు చేసేవారు? అన్న కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?  

ఆదిమ అపోస్తలులకు, నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులకూ ఉన్న మౌలిక తేడా ఏమిటంటే-  నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు  యేసు, దేవుడు కాకపోవటం ఏమిటి? అని ఊహించుకుంటున్నారు. కానీ, ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా తర్ఫీదు పొంది, ఆయన వద్ద శిక్షణ పొంది, ఆయన చెప్పిన సమస్త సువార్తను “చదవటం” కాదు స్వయంగా “విని” ఉన్నారు. దానిని విని నేటి సువార్తీకుల మాదిరిగా యేసు దేవుడనే అనుమానానికి ఎప్పుడూ గురికాలేదు! అంతేకాదు తాము స్వయంగా విన్న మరియు చూచిన దానినే మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులే ఈ క్రింది విధంగా ప్రకటిస్తున్నారు.

ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని టాకీ చూచేనో, అది మీకు తెలియజేయుచున్నాము. – 1 యోహాను 1:1

దీనిని బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా విన్నదే బోధించారు తప్ప నేటి సువార్తీకుల మాదిరిగా చదివి లేక ఎవరి ద్వారానో విని బోధించలేదని తేటతెల్లమవుతుంది. కాబట్టి నేడు బైబిల్ల్ కొన్ని వాక్యాలు కేవలం చదివి యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకత లను బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్టమొదటి హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని” “చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించు కోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ, ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (ఆ.పో.కా 5:42). చివరకు యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు (ఆ.పో.కా 17:3+18:5) తప్పితే నేను దర్శనంలో దేవుణ్ణి చూచానని గాని, యేసే దేవుడని గానీ ఏనాడూ ప్రకటించలేదు.

కాబట్టి యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమూ ఒక ప్రక్క ఉంది. అదే యేసు సువార్తను “చదివి” నేడు సువార్తీకులు చేస్తున్న వ్యాఖ్యానమూ మరో ప్రక్క ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏ వ్యాఖ్యానం ప్రామాణికం అవుతుంది? అన్నది గమనిస్తే కచ్చితంగా నాడు యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానమే ప్రామాణికం అవుతుంది. ఆ తరువాత ఆదిమ అపోస్తలులు చేసిన వ్యాఖ్యానానికి సరిపోయే వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే దానిని కూడా కచ్చితంగా తీసుకోవచ్చు.  

నిజంగా ఒకవేళ యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! - అనేక అద్భుతాలు చేశారు! వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని వ్యాఖ్యానించటం సరైనదే అయితే ఆ పని ఏనాడో ఆదిమ అపోస్తలులు చేసి ఉండేవారు. కాబట్టి ఏ యే వాక్యాలైతే “చదివి” యేసు దేవుడని నేడు కొందరు ప్రచారం చేస్తున్నారో ఆ వాక్యాలను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులు, యేసు దేవుడని ఎక్కడా ప్రచారం చెయ్యలేదంటే నేటి బోధకులు చేస్తున్న ప్రచారం కేవలం వాక్యవిరుద్ధం అని తెలుస్తుంది. ఇక నాడు యేసుకు, యూదులకు, ఆదిమ అపోస్తలులకూ, యూదులకు, పౌలుకు, యూదులకూ మధ్య యేసు మెస్సియా? కాదా? అన్న చర్చే జరిగినట్లు బైబిల్లో చూడగలం తప్ప ఎక్కడా యేసు దేవుడా? కాదా? అన్న వాదనే జరిగినట్లు చూడలేము. కానీ అలాంటి ప్రచారాలు చేస్తుంది మటుకు నేటి నామమాత్ర బోధకులు మాత్రమే! కాబట్టి ఏ వాక్యాలనైతే చదివి నేటి అధికశాతం సువార్తీకులు యేసే దేవుడనే భావనకు గురై ఉన్నారో ఆ వాక్యాల అసలు వాస్తవికతను పరిశుద్ధ బైబిల్ గ్రంధం వెలుగులో ఈ వెబ్ సైట్ లో ఎంతో వివరంగా వివరించటం జరిగింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ద బైబిల్ వాక్యాల యదార్ధ వాస్తవీకతను అర్థం చేసుకుని, అసలు సత్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించు గాక. ఆమేన్.                    

No comments:

Post a Comment