తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి.. –యోహాను 14:11
పై వాక్యాలను బట్టి
నేటి అధిక శాతం బోధకుల వాదన ఏమిటంటే- యేసు- “నేనును,
తండ్రీ ఏకమై ఉన్నామని చెప్పారు” కాబట్టి యెహోవా ఇద్దరూ
ఒక్కటే! కాబట్టి యేసే దేవున్నది! ఈ విధంగా ఊహించుకునేవారు అసలు యేసు ఏ అర్ధంలో “నేనును, తండ్రీ ఏకమై ఉన్నామ”ని చెప్పారో ముందు
తెలుసుకోవాల్సి ఉంటుంది.
యెహోవా మరియు
యేసు ఏ విషయంలో ఏకమై ఉన్నారు?
పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై
యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని
కాపాడుము… -యోహాను 17:11
మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై
యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. – యోహాను 17:22
పై వాక్యాలలో యేసు అభిలషిస్తున్న విషయం ఏమిటంటే- “పరిశుద్ధుడవైన
తండ్రీ మనము ఏకమై ఉన్నలాగున వారునూ ఏకమై ఉండవలెనని” అన్నది. అంటే మనము ఏ
విధమైన ఏకత్వాన్ని కలిగి ఉన్నామో, ఏ విధంగా ఏకమై ఉన్నామో అదే విధమైన ఏకత్వాన్ని శిష్యులు సైతం కలిగి
ఉండాలన్నది.
యెహోవా, యేసు మరియు
శిష్యులు కూడా ఏకమై ఉన్నారు? కాబట్టి అందరూ కలిపి ఒక దేవుడని అర్ధమా?
నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. –యోహాను 14:20
వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా
చేయబడి యేకముగా ఉన్నందున… యోహాను 17:23
పై వాక్యాలను బట్టి ఒక విషయం సుస్పష్టమవుతుంది. అదేమిటంటే-
యేసు, తండ్రి యందు ఉన్నారు. తండ్రి
యేసు యందు ఉన్నారు ఆ విధంగా తండ్రి, యేసు ఏకమై ఉన్నారు.
అంతేకాదు శిష్యులు, యేసు యందు ఉన్నారు. యేసు, శిష్యుల యందు ఉన్నారు. ఆ విధంగా యేసు మరియు శిష్యులు ఏకమై ఉన్నారు.
దీనిని బట్టి యేసు, తండ్రి యందు ఉన్నారు, తండ్రి యేసు యందు ఉన్నారు. యేసు, శిష్యుల యందు ఉన్నారు. శిష్యులు, యేసు యందు
ఉన్నారు. ఈ విధంగా తండ్రి, యేసు,
శిష్యులు ఏకమై ఉన్నారని తేటతెల్లమవుతుంది.
ఇపుడు యేసు “నేనును, తండ్రీ ఏకమై ఉన్నామ”ని చెప్పారు కాబట్టి తండ్రి, యేసు ఒక్కటే అని వాదించే వారు
అదే యేసు, శిష్యులతో సైతం ఏకమై ఉన్నానని చెబుతున్నారు.
కాబట్టి తండ్రి, యేసు, శిష్యులు కలిపి
ఒకే దేవుడని గాని, తండ్రితో పాటు యేసు మరియు శిష్యులు సైతం
దేవుళ్ళని గానీ ఒప్పుకోగలరా? ఈ ఏకత్వం అస్తిత్వ పరమైన
ఏకత్వమా? విశ్వాసపారమైన లేక ఆలోచనల పరమైన ఏకత్వమా? కాస్త ఆలోచించండి.
తండ్రితో పాటు
మనమూ ఏకమై ఉండే అవకాశం ఉంది!
ఆయన (యెహోవా) ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును. – 1 యోహాను 3:23
యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు. – 1 యోహాను 4:15
దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. – 1 యోహాను 4:16
పై వాక్యాలను బట్టి తండ్రి అయిన దేవునితో కేవలం యేసు మరియు
శిష్యులు మాత్రమే కాదు మనము సైతం ఏకమై ఉండే అవకాశం ఉందని తేటతెల్లమవుతుంది.
కాబట్టి పై వివరణను బట్టి యేసు కేవలం తండ్రి ఆలోచనలతో, నేను కూడా ఏకమై ఉన్నానని చెప్పటానికి
మాత్రమే “నేనును, తండ్రీ ఏకమై ఉన్నామ”ని ప్రకటించారు తప్పితే తండ్రీ, నేను దైవత్వ పరంగానో, అస్తిత్వ పరంగానో ఏకమై ఉన్నామని చెప్పటానికి ఆ విధంగా ప్రకటించలేదని
తేటతెల్లమైంది.
నేడు బోధకులు
బైబిల్ “చదివి” యేసు దేవుడని భావిస్తున్న మాదిరి గానే నాడు యేసు బోధను స్వయంగా
“విన్న” ఆదిమ అపోస్తలులూ అలాగే భావించేవారా?
యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు!
– “సర్వాధికారాలు నాకు ఇవ్వబడ్డాయని ప్రకటించారు” – “అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని
చెప్పారు!” – “తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు!” –
“నేనే మార్గం, సత్యం, జీవమని
ప్రకటించారు”– ఇంకా “యేసు, దేవుని ప్రియకుమారుడని
ప్రకటించబడ్డారు!” – “అనేక అద్భుతాలు చేశారు!” – “యెహోవాకు ఉన్న పేర్లు యేసు కూడా
కలిగి ఉన్నారు!” – “పునరుత్థా నమయ్యారు!” వగైరా ప్రత్యేకతలు యేసుకు ఉన్నప్పుడు
యేసును దేవుడని భావించటంలో తప్పేమిటి? ఇన్ని ప్రత్యేకతలు
యేసు దేవుడు కాకపోతే ఆయనకు ఉంటాయా? అన్నది నేటి అధిక శాతం
సువార్తీకుల వాదన!
ఈ వాదన వినటానికైతే ఎంతో బాగుంది. అయితే నేడు పై ప్రత్యేకతలను
బట్టి యేసును దేవుడని భావించటంలో తప్పులేదని ఊహించుకునేవారు... తాము చదువుతున్న
ప్రత్యేకతలు ఆదిమ అపోస్తలు లకు సైతం తెలిసే ఉంటాయి కదా అన్నది ఎందుకు ఆలోచించరు? ఆ ప్రత్యేకతలను బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసే దేవుడనే ప్రచారం చెయ్యక
యేసు “మెస్సియ” అనే ప్రచారం మాత్రమే ఎందుకు చేసేవారు? అన్న
కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు?
ఆదిమ అపోస్తలులకు, నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న బోధకులకూ ఉన్న మౌలిక తేడా
ఏమిటంటే- నేడు యేసు దేవుడని ప్రకటిస్తున్న
బోధకులు బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న యేసు, దేవుడు కాకపోవటం ఏమిటి? అని ఊహించుకుంటున్నారు.
కానీ, ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా తర్ఫీదు
పొంది, ఆయన వద్ద శిక్షణ పొంది, ఆయన
చెప్పిన సమస్త సువార్తను “చదవటం” కాదు స్వయంగా “విని” ఉన్నారు. దానిని విని నేటి
సువార్తీకుల మాదిరిగా యేసు దేవుడనే అనుమానానికి ఎప్పుడూ గురికాలేదు! అంతేకాదు తాము
స్వయంగా విన్న మరియు చూచిన దానినే మేము ప్రకటిస్తున్నామని ఆదిమ అపోస్తలులే ఈ
క్రింది విధంగా ప్రకటిస్తున్నారు.
ఆది నుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని టాకీ చూచేనో, అది మీకు తెలియజేయుచున్నాము.
– 1 యోహాను 1:1
దీనిని బట్టి నాటి ఆదిమ అపోస్తలులు యేసు ద్వారా ప్రత్యక్షంగా
విన్నదే బోధించారు తప్ప నేటి సువార్తీకుల మాదిరిగా చదివి లేక ఎవరి ద్వారానో విని
బోధించలేదని తేటతెల్లమవుతుంది. కాబట్టి నేడు బైబిల్ల్ కొన్ని వాక్యాలు కేవలం చదివి
యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు” అని చెప్పారు! – యేసు అబ్రాహము కంటే
ముందు నుండి ఉన్నానని చెప్పారు! – యేసు తండ్రి, నేను ఏకమై యున్నామని ప్రకటించారు! వగైరా వగైరా ప్రత్యేకత లను
బట్టి యేసు దేవుడని ప్రకటించటంలో తప్పులేదనుకుంటే అలా ప్రకటించటానికి మొట్టమొదటి
హక్కు దారులు యేసు శిష్యులే అవుతారు. కానీ ఈ ప్రత్యేకతలన్నిటినీ స్వయంగా “విని”
“చూచి” ఉన్న ఆదిమ అపోస్తలులు ఏనాడూ యేసును దేవుడై ఉంటారని ఊహించుకోవటంగానీ, అలా యూదులను ఒప్పించటంగానీ చేయలేదు. కానీ,
ఇంటింటికీ తిరిగి యేసే “క్రీస్తు” అయి ఉన్నాడని ఒప్పించేవారు (ఆ.పో.కా 5:42).
చివరకు యేసు తన దర్శనంలో కనిపించారని ప్రకటించుకున్న పౌలు సైతం ఏనాడూ యేసే దేవుడని
ప్రకటించక యూదులకు అనేక లేఖనాలను ఆధారంగా చూపి యేసు “మెస్సియ” (క్రీస్తు) అయి
ఉన్నారని ఒప్పిస్తూ ఉండేవాడు (ఆ.పో.కా 17:3+18:5) తప్పితే నేను దర్శనంలో దేవుణ్ణి
చూచానని గాని, యేసే దేవుడని గానీ ఏనాడూ ప్రకటించలేదు.
కాబట్టి యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు
చేసిన వ్యాఖ్యానమూ ఒక ప్రక్క ఉంది. అదే యేసు సువార్తను “చదివి” నేడు సువార్తీకులు
చేస్తున్న వ్యాఖ్యానమూ మరో ప్రక్క ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాల్లో ఏ వ్యాఖ్యానం
ప్రామాణికం అవుతుంది?
అన్నది గమనిస్తే కచ్చితంగా నాడు యేసు సువార్తను స్వయంగా “విని” ఆదిమ అపోస్తలులు
చేసిన వ్యాఖ్యానమే ప్రామాణికం అవుతుంది. ఆ తరువాత ఆదిమ అపోస్తలులు చేసిన
వ్యాఖ్యానానికి సరిపోయే వ్యాఖ్యానం ఎవరైనా చేస్తే దానిని కూడా కచ్చితంగా
తీసుకోవచ్చు.
నిజంగా ఒకవేళ యేసు “నన్ను చూచువాడు తండ్రిని చూచియున్నాడు”
అని చెప్పారు! – అబ్రాహము కంటే ముందు నుండి ఉన్నానని చెప్పారు! – తండ్రి, నేను ఏకమై యున్నామని
ప్రకటించారు! - అనేక అద్భుతాలు చేశారు! వగైరా ప్రత్యేకతలను బట్టి యేసు దేవుడని
వ్యాఖ్యానించటం సరైనదే అయితే ఆ పని ఏనాడో ఆదిమ అపోస్తలులు చేసి ఉండేవారు. కాబట్టి
ఏ యే వాక్యాలైతే “చదివి” యేసు దేవుడని నేడు కొందరు ప్రచారం చేస్తున్నారో ఆ
వాక్యాలను స్వయంగా “విన్న” ఆదిమ అపోస్తలులు, యేసు దేవుడని
ఎక్కడా ప్రచారం చెయ్యలేదంటే నేటి బోధకులు చేస్తున్న ప్రచారం కేవలం వాక్యవిరుద్ధం
అని తెలుస్తుంది. ఇక నాడు యేసుకు, యూదులకు, ఆదిమ అపోస్తలులకూ, యూదులకు,
పౌలుకు, యూదులకూ మధ్య యేసు మెస్సియా?
కాదా? అన్న చర్చే జరిగినట్లు బైబిల్లో చూడగలం తప్ప ఎక్కడా
యేసు దేవుడా? కాదా? అన్న వాదనే
జరిగినట్లు చూడలేము. కానీ అలాంటి ప్రచారాలు చేస్తుంది మటుకు నేటి నామమాత్ర బోధకులు
మాత్రమే! కాబట్టి ఏ వాక్యాలనైతే చదివి నేటి అధికశాతం సువార్తీకులు యేసే దేవుడనే
భావనకు గురై ఉన్నారో ఆ వాక్యాల అసలు వాస్తవికతను పరిశుద్ధ బైబిల్ గ్రంధం వెలుగులో
ఈ వెబ్ సైట్ లో ఎంతో వివరంగా వివరించటం జరిగింది. ఆ సృష్టికర్త అయిన దేవుడు
పరిశుద్ద బైబిల్ వాక్యాల యదార్ధ వాస్తవీకతను అర్థం చేసుకుని,
అసలు సత్యాన్ని స్వీకరించే జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించు గాక. ఆమేన్.
No comments:
Post a Comment